పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు నిరాశ ఎదురైంది. ఆయన హీరోగా నటిస్తోన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ (Adipurush) రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోమవారం ఉదయం చిత్ర దర్శకుడు ఓంరౌత్ (Om Raut) ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆదిపురుష్ అనేది సినిమా కాదు. శ్రీరాముడిపై భక్తి, సంస్కృతి, చరిత్రలపై మనకున్న నిబద్ధతకు నిదర్శనం. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించడం కోసం మరికొంత సమయం తీసుకోవాల్సి వస్తోంది. వచ్చే ఏడాది జూన్ 16న ‘ఆదిపురుష్’ను విడుదల చేయనున్నాం. భారతదేశం గర్వించే సినిమాగా దీన్ని మీ ముందుకు తీసుకురావాలని మేము నిర్ణయించుకున్నాం. మీ ప్రేమాభిమానాలే మమ్మల్ని నడిపిస్తున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ వార్తతో డార్లింగ్ అభిమానులు నిరాశ చెందుతూ పోస్టులు పెడుతున్నారు.
రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ‘ఆదిపురుష్’ చిత్రాన్ని రూపొందించారు. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్తో దీన్ని తెరకెక్కించినట్లు సమాచారం. రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతిసనన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. అయితే, దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా టీజర్పై సినీ ప్రియుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. నటీనటుల లుక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ అసలేం బాలేదని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి వీఎఫ్ఎక్స్ పనులపై చిత్రబృందం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఆదిపురుష్’ సంక్రాంతి బరి నుంచి వైదొలిగింది.