*విజయనగరం.. అమరావతి రైతుల పాదయాత్ర ఆగిపోయినట్లుగా భావిస్తున్నానని మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరంలో అన్నారు. ఏది ఏమైనప్పటికీ విశాఖ పరిపాలనా రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష సాకారం అయినట్టేనని అభిప్రాయపడ్డారు.విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని.. వాటిని పరిష్కరించుకొని త్వరలోనే విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామన్నారు. భోగాపురం విమానాశ్రయం భూ సేకరణ, నిర్వాసితుల పునరావాస పనులు, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం భూసేకరణపై విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
జిల్లాలోని భీమసింగి, సీతానగరం చక్కెర కర్మాగారాల పరిధిలో ఈ సీజన్లో రైతులు పండించిన చెరకును క్రషింగ్ కోసం శ్రీకాకుళం జిల్లాలోని చక్కెర కర్మాగారాలకు తరలింపు, రైతులకు చెల్లించే ధరపైనా అధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెలలో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, గిరిజన విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నామన్నారు. కొన్ని కోర్టు వివాదాలు ఉన్నాయని.. అవి త్వరలోనే పరిష్కారమవుతాయని మంత్రి పేర్కొన్నారు..
*విశాఖ రాజధాని సాధనపై త్వరలో రూట్ మ్యాప్*..
ఈ సందర్భంగా అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి స్పందిస్తూ .. ”తెదేపా వెనకుండి నడిపిస్తోంది కాబట్టే అమరావతి రైతులు పాదయాత్ర విరమించుకున్నారు. పాదయాత్రలో ఎంతమంది ఉన్నారు? అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టు అడిగింది. 600 మందితో వస్తున్న పాదయాత్రలో 60మంది కూడా రైతులు లేరు. అందుకే తెదేపా ముసుగులో ఉన్న అమరావతి రైతులు పాదయాత్రను ఆపేశారు. రైతుల పాదయాత్ర ఆగిపోయినట్టుగా భావిస్తున్నా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. విశాఖ రాజధాని సాధనపై త్వరలో రూట్ మ్యాప్ నిర్ణయిస్తాం” అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.