ఆసియా కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్…….

పాక్-శ్రీలంక జట్లలో విజయం సాధించిన టీమ్‌తో భారత్ ఫైనల్లో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్‌లో మొదట భారత్ 49.1 ఓవర్లలో 213 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదిందుకు బరిలోకి దిగిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో శ్రీలంక వన్డేల్లో వరుసగా 13 మ్యాచ్‌ల విజయాల పరంపరకు బ్రేక్ పడింది. బౌలింగ్‌లో ఐదు వికెట్లతోపాటు బ్యాటింగ్‌లో 42 పరుగులతో అదిరిపోయే పర్ఫామెన్స్ చేసిన శ్రీలంక యంగ్ ఆల్‌రౌండర్ దునిత్‌ వెల్లలాగేకు మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 213 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన శ్రీలంకను టీమిండియా పేసర్లు ఉక్కిరిబిక్కిరి చేశారు. పాతుమ్ నిస్సాంక (7), కుశాల్ మెండిస్ (15)లను జస్ప్రీత్ బుమ్రా ఔట్ చేయగా.. దిముత్ కరుణరత్నే (15)ను సిరాజ్ ఔట్ చేసి దెబ్బతీశారు. దీంతో తొలి 10 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 3 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. సమరవిక్రమ, అసలంక శ్రీలంక ఇన్నింగ్స్‌ను ఆదుకునేందుకు ప్రయత్నించారు. వీరిద్దరి మధ్య నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. ఈ ప్రమాదకరమైన జోడిని కుల్దీప్ యాదవ్ వీడదీశాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో సమరవిక్రమ (17) స్టంపౌట్ అయ్యాడు. ఆ తరువాత చరిత్ అసలంక (22), కెప్టెన్ దసున్ షనక (9) కూడా ఔట్ అవ్వడంతో 99 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది.అయితే ఈ దశలో ధనంజయ డిసిల్వాతో కలిసి దునిత్ వెల్లలాగే బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించాడు. వేగంగా పరుగులు చేస్తూ.. నెమ్మదిగా లక్ష్యం వైపు నడిపించారు. వీరిద్దరూ 7వ వికెట్‌కు 75 బంతుల్లో 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం మ్యాచ్‌లోకి పూర్తిగా చేతుల్లోకి వచ్చినట్లే అనిపినించింది. 41 పరుగులు చేసిన డిసిల్వాను జడేజా ఔట్ చేయడంతో మలుపు తిరిగింది. దునిత్ ఓ వైపు క్రీజ్‌లో ఉన్నా.. అవతలి వైపు నుంచి సహాకారం అందలేదు. 162 పరుగుల వద్ద 7వ వికెట్ కోల్పోయిన శ్రీలంక.. 172 పరుగులకే కుప్పకూలింది. దునిత్ వెల్లలగే 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత జట్టు తరఫున కుల్దీప్ యాదవ్ 4, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తలో రెండు వికెట్లు, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీశారు…టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు మంచి ఆరంభమే దక్కింది. కెప్టెన్ రోహిత్ శర్మ (48 బంతుల్లో 53, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (19) తొలి వికెట్‌కు 80 రన్స్ జోడించారు. అయితే దునిత్ వెల్లలాగే బౌలింగ్‌కు దెబ్బకు బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం పెవిలియన్‌కు క్యూ కట్టింది. రోహిత్, గిల్ వికెట్లతోపాటు విరాట్ కోహ్లీ (3)ని కూడా దునిత్ ఔట్ చేశాడు. ఆ తరువాత ఇషాన్ కిషన్ (33), కేఎల్ రాహుల్ (39) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
కోలుకున్నట్లే కనిపించి భారత్‌ను దునిత్ మరోసారి దెబ్బతీశాడు. కేఎల్ రాహుల్‌ను పెవిలియన్‌కు పంపించాడు. ఆ తరువాత ఇషాన్ కిషన్, హార్థిక్ పాండ్యా (5), రవీంద్ర జడేజా (4), బుమ్రా (5), కుల్దీప్ యాదవ్ (0) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. అక్షర్ పటేల్ (26) పర్వాలేదనిపించాడు. టీమిండియా వికట్లు మొత్తం స్పిన్నర్లకే దక్కడం విశేషం. దునిత్ వెల్లలగే ఐదు వికట్లు, అసలంక 4, తీక్షణ ఒక వికెట్ పడగొట్టారు..