చంద్రయాన్‌-3 Vs లూనా25పై ఉత్కంఠ!

*ఇస్రో చంద్రుడిపై పరిశోధనలు చేపట్టేందుకు (Moon Mission) ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్‌-3’ (Chandrayaan-3)..

తాజాగా కీలక ఘట్టాన్ని పూర్తిచేసుకుంది…

ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విజయవంతంగా విడిపోయిన ల్యాండర్‌ మాడ్యూల్‌
(Vikram, Pragyan)..
కొన్ని రోజుల్లో చంద్రుడి ఉపరితలంపై దిగేందుకు సిద్ధమైంది. ఇదే సమయంలో రష్యా ప్రయోగించిన లూనా-25 (Luna) కూడా జాబిల్లి దక్షిణ ధ్రువం వైపు అడుగులు వేస్తోంది. ఇలా భారత్‌, రష్యాలు వేర్వేరుగా ప్రవేశపెట్టిన ల్యాండర్లలో ఏది ముందు చంద్రుడిపై దిగనుందనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఈ రెండూ స్వల్ప వ్యవధి తేడాతోనే జాబిల్లిపై దిగే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ.. సురక్షితంగా దిగడమే ప్రధాన అంశమని నిపుణులు పేర్కొంటున్నారు..

భారత్‌కు 40.. రష్యాకు 11 రోజులే..
జులై 14న ప్రయాణాన్ని మొదలుపెట్టిన చంద్రయాన్‌-3.. చంద్రుడికి చేరువయ్యేందుకు మొత్తంగా 40 రోజులకు పైగా ప్రయాణించాల్సి వస్తోంది. మరోవైపు.. దాదాపు 50 ఏళ్ల విరామం తర్వాత చంద్రుడిపై పరిశోధనల కోసం ఆగస్టు 10న రష్యా ప్రయోగించిన లూనా-25..11 రోజుల్లోనే జాబిల్లిని చేరుకోనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఆగస్టు 23న చంద్రయాన్‌-3ను సురక్షితంగా దించేందుకు ఇస్రో ప్రయత్నాలు చేస్తుండగా.. లూనా-25 మాత్రం ఆగస్టు 21- 23వ తేదీల్లోనే దిగనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇస్రో ఇప్పటికే స్పష్టతనిచ్చినప్పటికీ.. రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ మాత్రం కచ్చితంగా ఏ సమయంలో దిగుతుందనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. వీలైతే ఈ రెండూ ఒకేరోజు చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది..

సామర్థ్యంలోనూ భారీ తేడాలు..
తక్కువ బరువుతోపాటు భారీ ఇంధన సామర్థ్యం.. లూనా-25 వేగంగా చంద్రుడి దగ్గరకు చేరేందుకు దోహదపడుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లూనా-25 మొత్తం బరువు 1750 కిలోలు కాగా.. చంద్రయాన్‌- 3 మాత్రం 3900 కిలోలు. ఇందులో పేలోడ్‌ బరువు సుమారు 1800 కిలోలు (ల్యాండర్‌, రోవర్‌లు కలిపి) కాగా, లూనా-25 పేలోడ్‌ కేవలం 31 కేజీలు మాత్రమే. చంద్రయాన్‌-3 కంటే తక్కువ ద్రవ్యరాశి ఉన్నందువల్లే లూనా-25 స్వల్ప సమయంలో వెళ్లేందుకు సాధ్యమవుతోందని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు లూనా-25కి ఇంధన నిల్వ సామర్థ్యం భారీగా ఉండటం వల్ల చంద్రుడిపైకి నేరుగా వెళ్లేందుకు దోహదపడుతోందని.. చంద్రయాన్‌-3లో ఇంధన సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఎక్కువసార్లు కక్ష్యలో తిరుగుతూ వెళ్లాల్సి వచ్చిందని ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ కే శివన్‌ వెల్లడించారు. అందుకే దీన్ని ప్రయోగించిన 22 రోజుల తర్వాత చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిందని అన్నారు.

సూర్యకాంతే కీలకం..
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న ఈ మిషన్‌లు చంద్రుడిపై దిగే సమయాన్ని సూర్యకాంతి ప్రభావితం చేస్తుందని నిపుణులు పేర్కొన్నారు. దక్షిణ ధ్రువంపై దిగే సమయంలో అక్కడ వెలుగు ఉండాలన్నారు. చంద్రుడిపై ఆగస్టు 23 నుంచి పగలు మొదలవుతుంది. ఇలా స్వల్ప సమయం తేడాతో భారత్‌, రష్యాలు ప్రయోగించిన వ్యోమనౌకలు చంద్రుడిపై దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో యావత్‌ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ మిషన్‌లు విజయవంతంగా జాబిల్లిపై దిగితే.. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3 మొత్తంగా 14 రోజులు పనిచేయనుండగా.. లూనా-25 మాత్రం ఏడాది పాటు పరిశోధనలు జరపనుంది…