ఎవరు ఎవరిని మోసం చేశారు..తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో ఓడిపోయి ఇంట్లో ఉంటే మంత్రి పదవి ఇచ్చినా..సీఎం కేసీఆర్..
ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని జీళ్ల చెర్వులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద ఎన్నికల సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో కొందరు నేతలకు డబ్బు అహంకారం ఉందని గులాబీ బాస్ కేసీఆర్ పేర్కొన్నారు. ఆ డబ్బు మదంతోనే ప్రజలను కొంటామన్న అహంకారంతో ఉన్నారన్నారు. తుమ్మల నాగేశ్వర రావుకు అన్యాయం చేశానని ప్రచారం చేస్తున్నారన్న కేసీఆర్ ఓడిపోయిన తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చి, ఎమ్మెల్సీగా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తుమ్మల ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు రాకుండా చేశారని మండిపడ్డారు. పదవి ఇచ్చి ఐదేళ్లు జిల్లాను అప్పగిస్తే చేసింది మాత్రం గుండుసున్నా అని విమర్శించారు. ఈ నేపథ్యంలో తుమ్మలకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందా? లేక బీఆర్ఎస్ పార్టీకి తుమ్మల అన్యాయం చేసిందా? అన్నది ఆలోచించాలన్నారు. అటువంటి అరాచక రాజకీయ నేతలకు గుణపాఠం చెప్పాలని సూచించారు. పదవుల కోసం పార్టీలు మారే వారిని క్షమించొద్దన్న కేసీఆర్ పూట పూటకు పార్టీలు మారే వారికి బుద్ధి చెప్పండన్నారు. నీతి, నిజాయితీతో అభివృద్ధి చేసిన వారిని గెలిపించండని కోరారు.