పనిమనుషులుగా చేరి..ఇళ్లంతా చోరీ..నేపాలీ గ్యాంగ్​ అరెస్ట్​….

హైదరాబాద్​లోని కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో వ్యాపారి దామోదర్‌ ఇంట్లో మొన్న రాత్రి చోరీకి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాలీయులే భారీ చోరీకి పాల్పడినట్టు గుర్తించిన ఎస్వోటీ పోలీసులు మహారాష్ట్ర సమీపంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను హైదరాబాద్‌ తీసుకొస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వివేకాననందనగర్‌లో ఉంటున్న వి.దామోదర్‌రావు ఇంట్లో చక్రధర్‌, సీత..8 నెలల క్రితం పనిమనుషులుగా చేరారు. ఇంటి ప్రాంగణంలోనే ఓ గదిలో నివాసం ఉండేవారు. వీళ్లకు మూడేళ్ల కుమారుడున్నాడు. ఈనెల 2న నాగ్‌పుర్‌ వెళ్లిన చక్రధర్​ దంపతులు.. 10న తిరిగి వస్తూ మరో వ్యక్తిని వెంటబెట్టుకొని వచ్చారు. దామోదర్​ కుటుంబసభ్యులు ఆరా తీస్తే తమ బంధువని చెప్పారు.దామోదర్‌రావు కుటుంబసభ్యులతో ఈనెల 12న రాత్రి 8 గంటల సమయంలో కొంపల్లిలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లారు. వాళ్లు బయటకు వెళ్లిన 10 నిమిషాలకే చక్రధర్‌, సీతతో పాటు వాళ్లతో ఉంటున్న వ్యక్తి చోరీకి సిద్ధమయ్యారు. ఇంటి మరోవైపు ఉన్న తలుపు గడియను విరగ్గొట్టి లోపలికి ప్రవేశించారు. సీసీ కెమెరాలపై ఓ వస్త్రాన్ని అడ్డుగా పెట్టి చోరీ చేశారు. రాత్రి 11.30 గంటల తర్వాత దామోదర్‌రావు, కుటుంబసభ్యులు ఇంటికి చేరుకునేసరికి తలుపులు తెరిచి ఉంచడం, నగదు, నగలు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని నిర్ధరించుకున్నారు. అదే సమయంలో చక్రధర్‌, సీత లేకపోవడంతో ఆ చోరీ వాళ్లే చేశారన్న అనుమానంతో.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం రూ.30 లక్షల నగదు, రూ.25 లక్షల బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు పేర్కొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు చివరికి నేపాలీ ముఠాను అదుపులోకి తీసుకున్నారు._*