చందానగర్‌లో తెల్లారుజామున భారీ అగ్ని ప్రమాదం

చందానగర్: చందానగర్‌లో శనివారం తెల్లారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. జాతీయ రహదారికి అనుకొని ఉన్న తపాడియాస్ మారుతిమాల్‌లో ఉదయం 6 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు అలుముకొని 5వ అంతస్తులో ఉన్న మల్టీ ఫ్లెక్స్ సినిమా హాల్‌లోకి మంటలు వ్యాపించాయి. ఇందులో ఉన్న ఐదు స్క్రీన్‌లలో 3 స్క్రీన్స్ పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. వెంటనే అక్కడకు చేరుకున్న డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో వేరే అంతస్తులోకి మంటలు వ్యాపించకుండా అదుపులోకి తీసుకువచ్చారు.తెల్లవారు జామున కావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే మాల్‌లో మంటలు ఎలా చెలరేగాయి, ఎందుకు చెలరేగాయి, ఏదైనా ప్రమాదం జరిగిందా, లేదా షార్ట్ సర్క్యూట్ కారణమా అనేది ఇంకా తెలియరాలేదు. ఈ తపాడియా మాల్ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో ఇంకా పూర్తి స్థాయిలో షాప్స్ తెరుచుకోలేదు. భారీ ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం. పూర్తి ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉన్నది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వైద్యాధికారి కార్తీక్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.