గాంధీకి ప్రపంచ నేతల నివాళి.. దిల్లీలో వర్షాలు!..

గాంధీకి ప్రపంచ నేతల నివాళి.. దిల్లీలో వర్షాలు!

*దిల్లీ.. జీ20 కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ప్రపంచ నేతలు మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయమే రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు..

ఆయన వివిధ దేశాధినేతలకు సాదరంగా స్వాగతం పలికారు. తేలికపాటి వర్షం కురుస్తున్నా.. ఆయా దేశాల అధ్యక్షులు, ప్రతినిధులు నిర్ణీత సమయానికి రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. అనంతరం మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం ప్రార్థనలు జరిగాయి. ఈ కార్యక్రమం తర్వాత దేశ నాయకులంతా భారత్‌ మండపానికి చేరుకున్నారు. మండపంలోని సౌత్‌ ప్లాజాలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. అనంతరం జీ20 మూడో సెషన్‌ అయిన ‘వన్‌ ఫ్యూచర్‌’ మొదలైంది. ఇది మధ్యాహ్నాం 12.30 వరకు జరుగుతుంది..

దేశ రాజధాని దిల్లీ (Delhi)లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 సదస్సు (G20 Summit) వేదికైన ప్రగతి మైదాన్‌ సహా పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నేడు కూడా ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం..దిల్లీలో 32 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత.. 24 డిగ్రీ సెల్సియస్‌ వద్ద కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. జీ20 సదస్సు జరుగుతున్న వేళ ఈ పరిస్థితి అధికారులకు సవాల్‌గా మారింది. రాజ్‌ఘాట్‌, సఫ్దర్‌జంగ్, దిల్లీ విమానాశ్రయం, వసంత్‌ కుంజ్‌, నరేలా తదితర ప్రాంతాల్లో రాత్రి నుంచి తేలికపాటి వర్షం ప్రారంభమైంది. ఇవి ఆదివారం కూడా కొనసాగే అవకాశం ఉందని IMD ట్విటర్‌ వేదికగా వెల్లడించింది..