*🔹గ్రూప్-2 పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం..*
_సంబంధితాధికారులతో చర్చించి మరో తారీఖును ఖరారు చేయాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశం.._
ఈనెల 29, 30 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు ఆందోళనలు చేయగా.. ఈ విషయంపై సీఎం కేసీఆర్ స్పందించారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గ్రూప్-2 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు ఇచ్చినట్టు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సంప్రదింపులు జరపాలని.. అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో.. గ్రూప్-2 అభ్యర్థులు చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కినట్టయింది…
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హుటాహుటిన టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శితో చర్చించారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పరీక్షను నవంబర్కు వాయిదా వేయాలని నిర్ణయించారు. అంతే కాకుండా భవిష్యత్లో పరీక్షల నోటిఫికేషన్లు జారీ చేసే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ చేసిన సూచనను పాటించాలని టీఎస్పీఎస్సీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియజేశారు.
గ్రూప్-2 పరీక్ష విషయంలో సీఎస్తో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించిన విషయాన్ని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కూడా ధృవీకరించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘గ్రూప్-2 పరీక్ష రీషెడ్యూల్ విషయమై సీఎస్తో సీఎం కేసీఆర్ చర్చించారు. అభ్యర్థులకు ఆటంకం లేకుండా పరీక్షను రీషెడ్యూల్ చేసేలా టీఎస్పీఎస్సీతో చర్చించాలని సీఎస్ను ఆదేశించారు. భవిష్యత్లో కూడా ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రతీ అభ్యర్థి.. ప్రతీ పరీక్షకు హాజరయ్యేందుకు, సన్నద్దమయ్యేందుకు సరిపడా సమయం ఇచ్చేలా నోటిఫికేషన్లు విడుదల చేయాలని సీఎస్ను ఆదేశించారు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. గ్రూప్-2 విషయంలో ఒక క్లారిటీ రావడంతో సోమవారం నాడు హైకోర్టులో జరగనున్న విచారణ నామమాత్రమే కానున్నది.