తెలంగాణలో భూములు, ఇళ్ళ స్థలాలకు భారీ గిరాకీ..ప్రీబిడ్ మీటింగ్స్ సక్సెస్..ఆన్ లైన్ ఆక్షన్ పై ఆసక్తి..

తెలంగాణలో భూములు, ఇళ్ళ స్థలాలకు భారీ గిరాకీ ఏర్పడింది. అందులోనూ ప్రభుత్వం డెవలప్ చేసి అమ్మకానికి పెడితే ఆ లేఅవుట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ (hmda) చేపడుతున్న ప్రీ బిడ్ మీటింగ్ లకు అనూహ్య స్పందన లభిస్తోంది. బండ్లగూడ, బహదూర్​ పల్లి, ఖమ్మం పరిధిలో నిర్వహించిన ప్రీబిడ్​ మీటింగ్స్​ సక్సెస్ అయ్యాయి. రాజీవ్​స్వగృహ భూములు, టవర్స్​ కొనుగోలు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. అధిక సంఖ్యలో హాజరైన ఔత్సాహికులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు…ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న ఆన్​ లైన్​ వేలం ప్రక్రియ గురించి అధికారులు వారికి అవగాహన కల్పించారు. హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​ మెంట్​అథారిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మూడు చోట్ల నిర్వహించిన ‘‘ప్రీబిడ్​ మీటింగ్స్’’​ విజయవంతం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రాజీవ్​ స్వగృహకు సంబంధించిన ప్లాట్లు, టవర్స్​ను ఆన్​లైన్​ వేలం(ఈ–ఆక్షన్​) పద్దతిలో విక్రయాలకు పెట్టినసంగతి తెలిసిందే. వాటిలో భాగంగా బండ్లగూడ(నాగోల్​–హైదరాబాద్​) రాజీవ్​ స్వగృహ టవర్స్​(అపార్ట్​ మెంట్స్​) ప్రాంగణంలో శుక్రవారం ఉదయం మొదటి ప్రీబిడ్​సమావేశం జరిగింది.మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా పరిధిలోని బహదూర్​ పల్లి(దుండిగల్​ మున్సిపాలిటీ)లో 101 ప్లాట్ల విక్రయాలపై శుక్రవారం మధ్యాహ్నం రెండో దఫా ప్రీబిడ్​ మీటింగ్​ ను హెచ్​ఎండిఏ అధికారులు నిర్వహించారు. ఈ రెండు ప్రీబిడ్​ సమావేశాలకు హెచ్ఎండిఏ చీఫ్​ ఇంజినీర్​ బిఎల్​ఎన్​ రెడ్డి, రాజీవ్​ స్వగృహ కార్పొరేషన్​ చీఫ్​ ఇంజినీర్​ డాక్టర్​ ఎస్​.ఈశ్వరయ్య, హెచ్ఎండిఏ సెక్రెటరీ చంద్రయ్య, ఎస్టేట్​ ఆఫీసర్​ గంగాధర్​, ఓఎస్డీ ఎం.రాంకిషన్​, సీజీఎం మాజీద్​ షరీఫ్​ లతో పాటు ఆన్​ లైన్​ వేలం నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్​టీసీ అధికారులు హాజరయ్యారు..