హుజూరాబాద్ ఉపఎన్నికలో భారీగా పోలింగ్ నమోదవుతున్నది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45.63 శాతం ఓటింగ్ నమోదయింది. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 7 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో ఓట్లు నమోదయ్యే అవకాశం ఉందని నాయకులు అంచనా వేస్తున్నారు. హుజూరాబాద్లో 45.05 శాతం ఓట్లు పోలవగా, వీణవంకలో 47.65 శాతం, జమ్మికుంటలో 45.36, ఇల్లందకుంటలో 42.09, కమలాపూర్లో 46.76 శాతం ఓట్లు పోలయ్యాయి…ఇల్లందకుంటలో మినహా మిగిలిన నాలుగు మండలాల్లో ఉదయం నుంచే భారీగా పోలింగ్ నమోదవుతున్నది. దీంతో ఉదయం 9 గంటవరకు 10.05 శాతం ఓట్లు నమోవదగా, 11 గంటలకు అది 33.27 శాతం ఓట్లు పోలయ్యాయి…
పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 61.66 శాతం పోలింగ్ నమోదయ్యింది. అక్కడక్కడ ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్,బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నారని పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కాన్వాయ్కు చెందిన మూడు వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. కమలాపూర్ మండలం మరిపెల్లి గూడెంలో వాహనాలకు అనుమతిలేదని ఈటలకు చెందిన మూడు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అదేవిధంగా ఈటల రాజేందర్ పీఆర్వోను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
నాయకులు ప్రలోభాలకు గురవుతారు కానీ ప్రజలు కాదు… ఈటల.
నాయకులు ప్రలోభాలకు గురవుతారు కానీ ప్రజలు కారని ఈటల అన్నారు. కేసీఆర్ అందర్నీ కొనుగోలు చేసి కోవర్టుగా చేసుకుంటున్నరని ఈటల అన్నారు. ప్రేమాభిమానం ముందు డబ్బులు, మద్యం పని చేయవన్నారు.. ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు అంటే మంచికి సంకేతమని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ నిశ్చేష్టం అయ్యిందని.. ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకోవాలని ఈటల అన్నారు. సాయంత్రానికల్లా 90 శాతం పోలింగ్ అవుతుందనుకుంటున్నానని ఈటల అన్నారు. కాగా.. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం ఒకవైపు ఉంటే.. ప్రజలంతా మరోవైపు ఉన్నారని ఈటల జమున అన్నారు….
హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి హిమ్మత్నగర్లోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. ప్రతిఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అంతకుముందు గెల్లు శ్రీనివాస్ దంపతులు ఇంట్లో దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. తల్లి పాదాలకు నమస్కరించి పోలింగ్ కేంద్రానికి బయల్దేరారు…
నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉన్నాను. నాకు పోలింగ్ బూతుల వద్దకు వెళ్లే అధికారం ఉంది…కౌశిక్ రెడ్డి.
‘నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉన్నాను. నాకు పోలింగ్ బూతుల వద్దకు వెళ్లే అధికారం ఉంది. నన్ను బీజేపీ వాళ్లు ఎలా అడ్డకుంటారు? ఎందుకు అడ్డుకుంటారు? కేవలం ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్తోనే ఇలా ప్రవర్తిస్తున్నారు. బీజేపీ నేతలకు ప్రజలు కచ్చితంగా ఓటుతో బుద్ధి చెబుతారు’ అని టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్రెడ్డి అన్నారు..
ఉపఎన్నికలలో డబ్బులు ఇస్తేనే ఓటు..!
ఉపఎన్నిక పోలింగ్ జరుగుతుంటే.. మరోపక్క తమకు డబ్బులిస్తేనే ఓటేస్తామని జమ్మికుంట మండలం రాచపల్లి గ్రామస్తులు సర్పంచ్ ఇంటిముందు నిరసన తెలుపుతున్నారు. గ్రామంలో కొందరికి మాత్రమే డబ్బులు పంపిణీ చేశారని.. తమకు కూడా డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తామని కొంతమంది ఓటర్లు నిరసన తెలిపారు. దాంతో పోలీసుల సహకారంతో సర్పంచ్ నిరసనకు దిగిన ఓటర్లను వెనక్కి పంపించారు…
ఎమ్మెల్యే పిఏ డబ్బులు పంచుతున్నారు అనే అభియోగాలు..
టీఆర్ఎస్ ఎమ్మెల్యే (వర్ధన్నపేట) ఆరూరి రమేష్ పీఏ కిరణ్ డబ్బులు పంచుతున్నాడు అనే ఆరోపణలతో బీజేపీ కార్యకర్తలు పట్టుకున్నారు. హుజురాబాద్ 51వ పోలింగ్ బూత్ పరిధిలో డబ్బులు పంచుతున్నరు అనే ఆరోపణలతో టీఆర్ఎస్ నేతలను బీజేపీ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు..