నెదర్లాండ్స్ పై ఇండియా ఘన విజయం..

టీ20 ప్రపంచకప్​లో భాగంగా నెదర్లాండ్స్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా ఘన విజయం సాధించింది…

56 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో ఈ ప్రపంచకప్​లో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక నెదర్లాండ్స్​ చతికిలపడింది. ఏదశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 123 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో బ్యాటర్లందరూ విఫలమయ్యారు.

టిమ్‌ ప్రింగ్లే 20, కోలిన్ అకరమన్‌ 17 పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌, అర్షదీప్‌, అక్షర్ పటేల్‌, అశ్విన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. షమికి ఒక వికెట్ దక్కింది.

అంతకుముందు *తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్​ఇండియా 179/2 స్కోరు చేసింది.* ఈ మ్యాచ్​తో కెప్టెన్‌ రోహిత్ శర్మ మళ్లీ ఫామ్​లోకి వచ్చాడు. 39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 రన్స్​తో ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడాడు. విరాట్ కోహ్లీ (62*: 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (51*: 25 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధశతకాలతో అదరగొట్టారు. కేఎల్ రాహుల్‌ (9) మరోసారి నిరాశపరిచాడు. కేఎల్​ రాహుల్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ ఆరంభించగా మొదట్లో పరుగులు సాధించడం కష్టమైంది. 9 పరుగులు చేసిన రాహుల్ ఎల్బీగా వెనదిరిగాడు. ఆ తర్వాత విరాట్‌, రోహిత్ కూడా ఆచితూచి ఆడారు. 53 పరుగులు చేసి రోహిత్ కూడా ఔటయ్యాడు. సూర్య కుమార్ వచ్చీరాగానే ఎదురుదాడి మొదలుపెట్టాడు. తర్వాత కోహ్లీ కూడా వేగం పెంచాడు. కోహ్లీ 44 బంతుల్లో 64 పరుగులు, సూర్యకుమార్ 25 బంతుల్లో 51 పరుగులతో అజేయంగా నిలిచారు. నెదర్లాండ్స్ బౌలర్లలో క్లాసెన్ , మీకెరెన్ చెరో వికెట్ తీశారు.