Amit Shah: ఐపీసీ, సీఆర్పీసీ స్థానాల్లో కొత్త చట్టాలు.. లోక్సభలో 3 బిల్లులు
భారత్లో నేర సంబంధిత న్యాయ వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్రం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఐపీసీ (IPC), సీఆర్పీసీ (CrPC), ఎవిడెన్స్ చట్టాల (Indian Evidence Act)ను వేరే కొత్త చట్టాలతో భర్తీ చేయనుంది..కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ఈ మేరకు మూడు బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టారు..భారతీయ న్యాయ సంహిత- 2023 (Bharatiya Nyaya Sanhita), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023 (Bharatiya Nagarik Suraksha Sanhita), భారతీయ సాక్ష్య బిల్లు- 2023 (Bharatiya Sakshya Bill)లను తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిస్తామని చెప్పారు..
‘ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్లు బ్రిటిష్ కాలంనాటి చట్టాలు. ఆంగ్లేయుల పాలనను రక్షించడం, బలోపేతం చేయడంతోపాటు శిక్షించడమే లక్ష్యంగా వాటిని ప్రవేశపెట్టారు. బాధితులకు న్యాయం చేయడం వాటి ఉద్దేశం కాదు! వాటి స్థానంలో ప్రవేశపెట్టనున్న కొత్త మూడు చట్టాలు.. భారత పౌరుల హక్కులను పరిరక్షిస్తాయి’ అని లోక్సభలో అమిత్ షా వ్యాఖ్యానించారు. ‘శిక్ష వేయడం కాదు.. న్యాయం అందించడం ఈ కొత్త చట్టాల లక్ష్యం. అయితే.. నేరాలను అరికట్టేందుకు శిక్షలు ఉంటాయి’ అని షా చెప్పారు..