మహబూబ్నగర్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును శనివారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. నార్లాపూర్ వద్ద తొలి పంపు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు.
https://youtu.be/M0I8EcjDMfI?si=Kv5-v4HoXwVDl7I0
డెలివరీ సిస్టర్న్ వద్ద సీఎం, మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా జలాలు నింపిన కలశాలకు వేద పండితులు పూజలు చేశారు. కలశాలను పలు గ్రామాల సర్పంచ్ లకు అందజేయనున్నారు.
KCR Speech in Kollapur Public Meeting :
కొల్లాపూర్ సింగోటం క్రాస్రోడ్డులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ‘70 ఏళ్లు ఏడిచిన పాలమూరును పట్టించుకోలేదే. తెలంగాణను ఊడగొట్టింది ఎవరు? ఇదే కాంగ్రెస్ కాదా? తెలంగాణను ఉద్దరిస్తా.. నేను దత్తత తీసుకున్నానని చెప్పి.. పునాది రాళ్లు పాతింది తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు కాదా? ఎవరైనా సహాయం చేశారా? మనం ఏడ్చిన నాడు.. వలసపోయినాడు.. జిల్లా మొత్తం బొంబాయి బతుకులకు ఆలవాలమైన నాడు.. ఆగమాగమైననాడు ఎవరైనా పట్టించుకున్నాడా? మనం కొట్లాడుకొని.. రాష్ట్రం తెచ్చుకొని ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం. మళ్లీ ఆగమైతే గోసపడుతాం.
ఇక ఇవాళ ఇంత పెద్ద ప్రాజెక్టు మంజూరు చేసుకొని.. ఇప్పుడు నీళ్లు చూస్తేంటే నా జన్మ ధన్యమైంది. తెలంగాణ కోసం పార్లమెంట్లో బిల్లు పాసైన రోజు హృదయం పొంగిపోయిందో.. పాలమూరు పంపు ఆన్ చేసిన తర్వాత నా హృదయం పొంగిపోయింది. సంతోషం అనిపించింది. నేను కోరుకున్నది ఇదే. ఆ నాడు ఎవరూ తేలే. మన తెలంగాణలో తెచ్చుకోవాలనుకున్నాం. తెచ్చుకున్నాం. మనకు జాతి, మతం, కులం లేదు. యావత్ తెలంగాణ బిడ్డలు మనోళ్లే. అందరికీ నీళ్లు రావాలి. బాగుపడాలి. రంగారెడ్డి, వికారాబాద్కు కూడా నీళ్లు రావాలి. ఐకమత్యాన్ని కొనసాగించాలి.
విశ్వగురు అని చెప్పుకునే మోదీ.. 9 ఏళ్లుగా మన నీళ్ల వాటా తేల్చలేదని కేసీఆర్ దుయ్యబట్టారు. 10 ఏళ్లుగా కృష్ణా ట్రైబ్యునల్కు ఎందుకు ప్రతిపాదనలు పంపటం లేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలను పాలమూరు జిల్లా ప్రజలు నిలదీయాలని అన్నారు. దత్తత తీసుకున్న సీఎంలు కూడా ఈ జిల్లాలకు చేసిందేమీ లేదని కేసీఆర్ విమర్శించారు…
నేను ఒక్క మాట అడుతుతున్న బీజేపీ బిడ్డలను. మీకు సిగ్గూ శరం, చీమునెత్తురు, పౌరుషం ఉంటే.. పెద్ద సిపాయి పార్టీ అని మాట్లాడుతరు. పాలమూరుకు, తెలంగాణకు నీళ్ల గురించి కేంద్రాన్ని అడిగాం. కృష్ణా నదిలో వాటాతేల్చమని ప్రధాని మోదీని కోరాం. ఇంత పెద్ద విశ్వగురువు అని చెప్పుకునే ప్రధాని, మా అంత సిపాయిలు అనే బీజేపీ, ఇక్కడ పెద్ద పెద్ద పోజులు కొట్టే నాయకులు మహబూబ్నగర్లో ఉన్నరు. వాటా తేల్చేందుకు పదేళ్లు అవుతుందా? కృష్ణా ట్రిబ్యునల్కు రెండు రాష్ట్రాలకు నీళ్లు పంచమని లేఖ రాయించాలి. దానికి మోదీ కుయ్మనడు కైమనడు..