జమిలి ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ, జమిలి ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు..మరో ఆరు నెలల తర్వాతే ఎన్నికలు ఉండవచ్చేమోనన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌, మే నెలల్లో జరగవచ్చని, అక్టోబర్‌లో నోటిఫికేషన్‌ రాకపోవచ్చన్నారు. ఎన్నికలపై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే, జమిలి ఎన్నికలు ఉన్నా లేకపోయినా భారత రాష్ట్ర సమితికే లాభమన్నారు.