మహాలయ అమావాస్య , శుభ ముహుర్తం , పూజా విధానం , విశిష్టత…

మహాలయ అమావాస్య , శుభ ముహుర్తం , పూజా విధానం , విశిష్టత..

ఈసారి అమావాస్య ఆదివారం నాడు రావడంతో దీనికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ సందర్భంగా ఈసారి వచ్చిన మహాలయ అమావాస్య రోజు శుభ ముహుర్తం ఎప్పుడు.. ఏ సమయంలో పూజలు చేయాలి.. ఎవరిని ఆరాధించాలి.. ఈ మహాలయ అమావాస్య ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో చివరి రోజున మహాలయ అమావాస్య వస్తుంది. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరంలో సెప్టెంబర్ 25వ తేదీన అమావాస్య వచ్చింది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ సమయంలో పూర్వీకులు భూ లోకానికి వస్తారని చాలా మంది నమ్ముతారు. ఆ మరుసటి రోజే అశ్విజ మాసం ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన దుర్గా మాత భూ లోకానికి వచ్చి భక్తులందరినీ ఆశీర్వదిస్తుంది చాలా మంది విశ్వాసం. అందులోనూ ఈసారి అమావాస్య ఆదివారం నాడు రావడంతో దీనికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ సందర్భంగా ఈసారి వచ్చిన మహాలయ అమావాస్య రోజు శుభ ముహుర్తం ఎప్పుడు.. ఏ సమయంలో పూజలు చేయాలి.. ఎవరిని ఆరాధించాలి.. ఈ మహాలయ అమావాస్య ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

*​శుభ ముహుర్తం*

సెప్టెంబర్ 25వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 3:13 గంటలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది.

సెప్టెంబర్ 26వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3:09 గంటలకు ముగుస్తుంది.

ఆ వెంటనే దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో దుర్గా దేవి భూ లోకంలో అడుగుపెడుతుందని పండితులు చెబుతారు.

*విజయ ముహుర్తం..

సెప్టెంబర్ 25న మధ్యాహ్నం 2:13 నుండి మధ్యాహ్నం 3:01 గంటల వరకు

*అభిజిత్ ముహుర్తం..

సెప్టెంబర్ 25న ఉదయం 11:48 నుంచి 12:37 గంటల వరకు

*​పూజా విధానం*

ఈ పవిత్రమైన రోజున తెలుపు రంగు దుస్తులు ధరించి పూర్వీకుల పేరిట తర్పణం చేయాలి. పూజ చేసే సమయంలో దక్షిణం వైపు మీ ముఖం పెట్టి కూర్చోవాలి. ఆ తర్వాత రాగిపాత్రలో గంగాజలం తీసుకుని , అందులో నల్ల నువ్వులు , పచ్చి పాలు , కుసాలను కలపాలి. ఈ నీటిని సూర్యదేవునికి సమర్పిస్తూ పూర్వీకుల ఆత్మ శాంతి కోసం ప్రార్థించాలి. ఈరోజు తయారు చేసే ఆహారాన్ని ఐదు భాగాలు చేసి ముందుగా దేవుడికి , తర్వాత గోమాత , శునకం , చీమ , కాకులకు నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం బ్రాహ్మణులకు కూడా అన్నదానం చేసి వారికి తెల్లని వస్త్రాలు దానం చేయాలి.

*​మహాలయ అమావాస్య ప్రాముఖ్యత*

మహాలయ అమావాస్య రోజున పితృ పక్షాలు పూర్తవుతాయి. పితృ పక్షాల్లో ఇది చివరి రోజు కాబట్టి ఈరోజున నువ్వులు , కుశ గడ్డి కలిపిన నీటితో పితృ దేవతలకు పిండాలను చేసి తర్పణం , శ్రాద్ధం నిర్వహిస్తారు. ఈ పిండాలను కాకులు వచ్చి తింటే తమ పూర్వీకుల నుంచి అనుగ్రహం లభించినట్టేనని నమ్ముతారు. అంతేకాదు మీ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటంటే.. ఎవరైతే చనిపోయిన వ్యక్తులుంటారో.. వారు ఏ తిథిలో మరణించారో తెలియకపోతే వారు మరణించిన ఏడాదిలో శ్రాద్ధ కర్మలు చేయలేని వారు మహాలయ అమావాస్య రోజున వారికి శ్రాద్ధం నిర్వహిస్తే వారి నుంచి ఆశీస్సులు పొందుతారని పండితులు చెబుతారు.
​మహాభారతంలోనూ ఈ అమావాస్య ప్రస్తావన..

మహాభారతంలోనూ మహాలయ అమావాస్య గురించి ప్రస్తావన ఉంది. దీని ప్రకారం , కర్ణుడు యుద్ధంలో మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్లే సమయంలో దారిలో తనకు దాహం వేస్తుంది. అప్పుడు తను ఓ నది దగ్గరకు వెళ్తాడు. అక్కడ నీటిని తాగేందుకు ప్రయత్నించగా అది బంగారంగా మారిపోతుంది. ఆ తర్వాత కర్ణుడికి ఆకలి వేస్తుంది. అప్పుడు ఒకచోట మామిడి చెట్టు కనిపిస్తుంది. పండ్లను చూసి సంతోషపడ్డ కర్ణుడు వాటిని కోసేందుకు వెళ్లగా అవి కూడా బంగారంగా మారిపోతాయి.

*​సూర్య దేవుని ప్రార్థన*

ఈ విచిత్ర సంఘటనలను చూసి తన తండ్రి అయిన సూర్య భగవానుడిని ప్రార్థిస్తాడు. తన సమస్యకు పరిష్కారం చూపమని కోరతాడు. అప్పుడు సూర్యుడు కర్ణుడితో ఇలా అంటాడు. *‘నీవు భూలోకంలో ఎన్నో దానాలు చేశావు. అయితే ఏరోజు పితృ దేవతలకు అన్నదానం , శ్రాద్ధ కర్మలు నిర్వహించలేదు. అందుకే ఇప్పుడీ పరిస్థితులు ఏర్పడ్డాయని’* సూర్యుడు వివరిస్తాడు. అప్పుడు పితృదేవతలకు , శ్రాద్ధ కర్మలు చేసే అవకాశం కల్పించాలని కోరతాడు.

*​ఇంద్రుని సహాయంతో*

అప్పుడు కర్ణుడు ఇంద్రుని సహాయంతో భూలోకానికి వచ్చి పితృ దేవతలందరికీ తర్పణాలు , శ్రాద్ధ కర్మలు , అన్నదానం నిర్వహించి మహాలయ అమావాస్య రోజున స్వర్గానికి తిరిగి వెళ్లాడు. ఆనాటి నుంచి పురాణాల ప్రకారం ఎవరైనా పితృ రుణాలను తీర్చుకోవాలి. అప్పుడే మీకు రెట్టింపు శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు.