మల్లారెడ్డీ.. సిల్క్ స్మిత లాగా రోడ్లపై చిందులు ఏంటి?
మల్లారెడ్డి చిల్లరి వేషాలు..
ప్రత్యేక తెలంగాణ సాధన కోసం మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ క్రియాశీలకంగా పనిచేశారు. వైద్యుడైన ఆయన తన వృత్తిని వదిలి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ పిలుపుతో టీఆర్ఎస్లో చేరారు. 2014 ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నుంచి గెలుపొందారు. 2019లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన టీఆర్ఎస్ (TRS)కు దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే నర్సయ్య గౌడ్ను బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు సంప్రదింపులు జరిపారు. అన్ని అనుకున్నట్లే జరిగాయి. ఈ రోజు (అక్టోబర్ 19)న ఆయన బీజేపీ (BJP)లో చేరారు. నర్సయ్య గౌడ్.. బీజేపీలోకి చేరిన వెంటనే టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. తెలంగాణ అభివృద్ధి కోసమే బీజేపీలో చేరానని తెలిపారు. టీఆర్ఎస్లో ఆత్మగౌరవం లేదని, సీఎం కేసీఆర్ను కలవాలంటే ఏదో ఒక పదవిలో ఉండాలా అని ప్రశ్నించారు. తాను చాలా సౌమ్యుడినని, దయచేసి తనను గెలకొద్దన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. వేల కోట్లున్న మల్లారెడ్డి చిల్లర పనులు మానుకోవాలన్నారు. నటి సిల్క్ స్మిత లాగా రోడ్లపై చిందులు ఏంటని ప్రశ్నించారు. రేపటి (గురువారం) నుంచి మునుగోడు ప్రచారంలో పాల్గొంటానని నర్సయ్యగౌడ్ ప్రకటించారు.