మార్గదర్శికి చెందిన 23 చిట్ గ్రూపుల్ని నిలిపివేసింది..

మార్గదర్సి చిట్‌ఫండ్స్ అక్రమాల కేసును అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించవచ్చని ఏపీసీఐడీ తెలిపింది. అక్రమాలు భారీగా వెలుగుచూడటంతో ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శికి చెందిన 23 చిట్ గ్రూపుల్ని నిలిపివేసింది…మార్గదర్శి కేసును దర్యాప్తు చేస్తున్న ఏపీసీఐడీ విచారణలో నిర్ఘాంతపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. మార్గదర్శికి చెందిన 9 శాఖల్లో అవకతవకలు జరిగినట్టుగా సీఐడీ గుర్తించింది. మార్చ్ 10న కేసు దర్యాప్తు చేపట్టిన ఏపీసీఐడీ ఇప్పటి వరకూ 7 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మార్గదర్శి శాఖలున్నాయి. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో 2021-22 ఆర్ధిక సంవత్సరానికి మార్గదర్శి వార్షిక టర్నోవర్ 9,677 కోట్లు. 1982 చిట్‌ఫండ్ చట్టాన్ని అతిక్రమించి డిపాజిటర్ల డబ్బుల్ని అక్రమంగా తరలించిన ఆరోపణలున్నాయి. డిపాజిటర్లకు ఎక్కువ డబ్బు ఆశ చూపించి..చందాదారుల డబ్బును నిబంధనలకు వ్యతిరేకంగా వివిధ సంస్థలకు తరలించింది మార్గదర్శి. ఏపీసీఐడీ విచారణ సమయంలో మనీ లాండరింగ్, నిధులు స్వాహా చేయడం, కార్పొరేట్ మోసాలు, బినామీ లావాదేవీలు బయటపడ్డాయని ఏపీసీఐడీ వివరించింది. ఇప్పటికే ఈ కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా శైలజా కిరణ్ ఉన్నారు. ఇప్పటికే రామోజీరావు, శైలజా కిరణ్‌లను సీఐడీ విచారించింది. సత్యం కంప్యూటర్స్, సహారా, శారదా చిట్స్ మోసాలతో మార్గదర్శి అక్రమాలకు సారూప్యత ఉందంటోంది ఏపీసీఐడీ. మార్గదర్శి కంపెనీ లెక్కల్ని పరిశీలిస్తే ఎంత పెద్ద కుంభకోణమో అర్ధమౌతుందంటోంది. ఏపీలోనే అతిపెద్ద చిట్‌ఫండ్ కుంభకోణాన్ని నిరోధించే ప్రయత్నం చేస్తున్నట్టు ఏపీసీఐడీ అధికారులు వివరించారు. అమల్లో ఉన్న చట్టాలన్ని ఉల్లంఘిస్తూ పెద్దఎత్తున నిధుల తరలింపు జరిగిందని సీఐడీ చెబుతోంది. విచారణలో వెలుగుచూసిన మనీ లాండరింగ్, అక్రమ డబ్బు తరలింపు, బినామీ పేర్లతో ఐటీ ఎగవేత అంశాల్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కోరినట్టు సీఐడీ తెలిపింది..