మాసాబ్ ట్యాంక్లోని ఇన్ కమ్ ట్యాక్స్ టవర్కు సోమవారం బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం రేపింది. కంట్రోల్ రూం నెంబర్ 100 కు ఫోన్ చేసిన అగంతకుడు మరికొద్ది సేపట్లో ఐటీ ఆఫీస్లో బాంబు పేలనుందని చెప్పి ఫోన్ పెట్టేశాడు. వెంటనే కంట్రోల్ రూం సిబ్బంది స్థానిక పోలీసులను అలర్ట్ చేసారు.
ఇది దావానలంలా వ్యాపించటంతో అధికారులు, సిబ్బంది పరుగు పరుగున బయటకు వచ్చారు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన పోలీసులు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ను రప్పించారు. పోలీస్ జాగిలాలు, మెటల్ డిటెక్టర్ల సాయంతో స్క్వాడ్ సిబ్బంది గాలిస్తున్నారు. కాగా, కొంతకాలం క్రితం ఐటీ అధికారులు వేర్వేరు రియల్ ఎస్టేట్ సంస్థలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎవరైనా కక్షగట్టి ఈ కాల్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.