ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫ్లెక్సీలు హల్‌చల్‌…

మోదీ ఇలాకాలో సీఎం కేసీఆర్ ప్లెక్సీలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫ్లెక్సీలు హల్‌చల్‌ సృష్టిస్తున్నాయి.

‘దేశ్‌కీ నేత కేసీఆర్‌, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు జీ.. ఉత్తర్‌ప్రదేశ్‌ ఆప్‌కో హార్ధిక్‌ స్వాగత్‌ కర్తాహై’ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వారణాసి అంతటా వెలిశాయి. ఇప్పటికే పలు రాష్ర్టాల్లో కేసీఆర్‌కు లభిస్తున్న ఆదరణతో ఉత్తరాది రాజకీయాల్లో విస్తృత చర్చ జరుగుతున్నది. మహారాష్ట్ర..

ఆంధ్రప్రదేశ్‌ల్లో వెలిసిన ఫ్లెక్సీలు ఏకంగా నేడు ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి (ఉత్తరప్రదేశ్‌)లో వెలియటం చర్చనీయాంశమైంది. ఇటీవలే తమిళనాడుకు చెందిన 12 రైతుసంఘాల నేతల బృందం కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించి కొనియాడాయి. తెలంగాణ రైతు పథకాలను తమ రాష్ట్రంలో అమలుచేయాలని డిమాండ్‌ చేశాయి. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా స్థానిక వ్యాపారి మృత్యుంజయ మిశ్ర పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఫ్లెక్సీలు పెట్టిన విషయంతెల్సిందే. తాజాగా వారణాసి పట్టణంలో తెలంగాణ మ్యాప్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్‌డ్రాప్‌లో సీఎం కేసీఆర్‌ భారీ ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు. ఈ ఫ్లెక్సీలో పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, మహారాష్ట్ర, ఓడిశా రాష్ర్టాల ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్‌, ఉద్దవ్‌ ఠాక్రే, నవీన్‌పట్నాయక్‌, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌యాదవ్‌, ఎన్‌సీపీ నేత శరద్‌వార్‌, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌, మాజీ ప్రధాని దేవేగౌడ, సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ ఫొటోలతోపాటు మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కేకే, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ఫొటోలు ఉన్నాయి.