వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పత్తా లేకుండా చేస్తాం’ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

Modi Fires on BRS Govt.

ఓ బీజేపీ కార్యకర్తగా ప్రజల మధ్యకు వచ్చానని ప్రధాని మోదీ అన్నారు. పౌరుషానికి వరంగల్ నగరం ప్రతీక అని చెప్పారు. వరంగల్ పర్యటనలో భాగంగా హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించారు.
జన్ సంఘ్ సమయం నుంచే వరంగల్ తమకు కంచుకోట అని ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీకి కేవలం 2 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నప్పుడు.. అందులో హనుమకొండ నుంచి గెలిచిన చందుపట్ల జంగారెడ్డి ఒకరని గతాన్ని గుర్తు చేసుకున్నారు.

2021 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కేవలం ట్రైలరే చూపించిందని అన్నారు. తెలంగాణ అభివృద్ధే తమ లక్ష్యమని చెప్పారు. దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర ఎంతో కీలకమని, మేడిన్ ఇండియాకు తెలంగాణ ఎంతో సాకారం అందించిందని అన్నారు. ‘కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ ట్రైలర్‌ చూపించింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను అడ్రస్‌ లేకుండా చేస్తాం. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. ఈ రోజు మాకు ఓ విషయం స్పష్టమైంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మా గెలుపు ఖాయం. కాంగ్రెస్, బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం” అని ధీమా వ్యక్తం చేశారు…
‘వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పత్తా లేకుండా చేస్తాం’

కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే కేసీఆర్‌ సర్కారు పని అని మోదీ దుయ్యబట్టారు. ఇలాంటి కుటుంబ పాలనలో రాష్ట్రం చిక్కుకుంటుందని ప్రజలు అనుకోలేదని చెప్పారు. కాంగ్రెస్‌ అవినీతి పాలనను దేశమంతా చూసిందని.. కేసీఆర్‌ అవినీతి పాలనను తెలంగాణ చూసిందని విమర్శించారు.