టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసు.. ఏ1గా బండి సంజయ్..
హనుమకొండ జిల్లా కమలాపూర్లో టెన్త్ హిందీ ప్రశ్నపత్రాన్ని బయటకు తీసుకొచ్చిన కేసులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను బుధవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో బండి సంజయ్ను ఏ1గా చేర్చారు. ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా మోతం శివగణేశ్, ఏ6గా పోగు సురేశ్, ఏ7గా పోగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పోతబోయిన వసంత్ పేర్లను చేర్చారు.
సంజయ్పై కమలాపూర్ పోలీసులు తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్, 1997 లోని సెక్షన్ 5 కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 120 బీ, సెక్షన్ 420 కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్ను పోలీసులు హనుమకొండ కోర్టు కాంప్లెక్స్ పక్కనే జడ్జి అనిత రాపోలు ఎదుట ప్రవేశపెట్టారు.
అయితే బండి సంజయ్ను జడ్జి ఎదుట ప్రవేశపెట్టేందుకు తీసుకువస్తున్నారని బీజేపీ కార్యకర్తలకు సమాచారం తెలియడంతో అక్కడికి భారీగా చేరుకున్నారు. బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులు కూడా చేరుకున్నారు. అయితే ఏ ఒక్కరిని కూడా లోపలికి అనుమతించకుండా అటు కోర్టు గేటు వద్ద, ఇటు జడ్జి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడకు భారీగా చేరుకున్నారు. ఇరు వర్గాలు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.
కరీంనగర్లో బండి సంజయ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మొదట యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం పీఎస్కు తరలించారు. అక్కడ్నుంచి జనగామ పట్టణం మీదుగా పాలకుర్తికి తరలించారు. పాలకుర్తి సీహెచ్సీలో బండి సంజయ్కు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం హనుమకొండ మెజిస్ట్రేట్ ఎదుట సంజయ్ను పోలీసులు హాజరు పరిచారు. టెన్త్ హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో బీజేపీ కార్యకర్త బూరం ప్రశాంత్ను మంగళవారం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.