మునుగోడు ఉపఎన్నిక వేళ.. హైదరాబాద్‌లో భారీగా హవాలా సొమ్ము పట్టివేత..

: నగరంలో మరోసారి భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా జుమ్మేరాత్‌ బజార్‌ వద్ద నగదును తరలిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వారి నుంచి కారు, నగదును స్వాధీనం చేసుకున్నారు. షాహినాత్‌గంజ్‌కు చెందిన కమలేశ్‌, అశోక్‌ కుమార్‌, రతన్‌సింగ్‌, గోషామహల్‌కు చెందిన రాహుల్‌ అగర్వాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ము సంపాదించాలనే ఆలోచనతోనే ఈ ముఠా హవాలా సొమ్ము తరలింపు మార్గాన్ని ఎంచుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. అయితే, ఎవరి ఆదేశాలతో ఎక్కడ నుంచి ఎక్కడికి డబ్బు తీసుకెళ్తున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఈ హవాలా సొమ్ముతో ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.