నేటి కథ..*హైసర బజ్జా…

నేటి కథ..*హైసర బజ్జా*

*అనగా అనగా….. రామాపురం అనే ఊర్లో రాజశేఖరం అనే యువకుడుండేవాడు. ఇతడు కొంచెం అమాయకుడు. దానికి తోడు ఙ్ఞాపకశక్తి పెద్దగా ఉండేది కాదు. అతడికి పెళ్ళై భార్య విశాలాక్షి కాపురానికొచ్చింది. విశాలాక్షి అణకువ గల పిల్ల. పనీ పాటలు తెలిసిన అమ్మాయి.*

*ఓసారి రాజశేఖరుడు ఏదో పని ఉండి ప్రక్కఊరు రాఘవాపురం వెళ్ళాడు. పని పూర్తయ్యాక ఆ ఊళ్ళోనే ఉన్న మేనత్తని చుట్టపు చూపు చూడబోయాడు. రాక రాక వచ్చిన మేనల్లుణ్ణి అతడి మేనత్త ఎంతో సంతోషంగా ఆహ్వానించి ఆదరించింది. పిండి వంటలతో భోజనం పెట్టింది. భోజనంలో వడ్డించిన బూరెలు రాజశేఖరానికి తెగనచ్చేసాయి. ఒకటికి రెండు అడిగి పెట్టించుకొని తిన్నాడు.*

*“అత్తా! వీటి పేరేంటి?” మొహమాట పడుతూ అడిగాడు రాజశేఖరుడు. ఆవిడ అభిమానంగా నవ్వుతూ “బూరెలంటారు నాయనా? మరి నాలుగు కట్టివ్వనా?”అంది.*

*”వద్దులే అత్తా! విశాలాక్షికి అన్నీ వచ్చు. వండించుకు తింటాలే!” అంటూ ఇంటికి బయలుదేరాడు. ఆరోజుల్లో ప్రయాణం అంటే కాలినడక లేదా ఎద్దుల బళ్ళే శరణ్యం కదా! మనవాడు నడుచుకుంటూ బయలుదేరాడు. ఎక్కడ పిండి వంట పేరు మరిచిపోతానో అనుకుంటూ “బూరెలు, బూరెలు” అని వల్లిస్తూ అడవిదారి వెంట నడవ సాగాడు.*

*దారిలో చిన్న నీటి పాయ వచ్చింది. ఎగిరి దాని మీదుగా దూకూతూ వూపు కోసం “హైసర బజ్జ” అన్నాడు.*

*అంతే!*

*బూరెల పేరు మరిచిపోయి, ’హైసరబజ్జా’ అని జపం చేస్తూ ఇల్లు చేరాడు. ఇంటికి రాగానే భార్యని పిలిచి తన మేనత్త వడ్డించిన పిండివంట రుచిని తెగ వర్ణించి, తనకు వండి పెట్టమన్నాడు.*

*”వాటినే మంటారని చెప్పారు, మీ మేనత్త గారు?” అనడిగింది విశాలాక్షి.*

*”హైసరబజ్జ!” టక్కున చెప్పాడు రాజశేఖరం.*

*అదేం పిండి వంటో విశాలాక్షి కి అర్ధం కాలేదు.*

*”ఎలా ఉన్నాయి? తియ్యగానా, కారంగానా?” అంది.*

*”తియ్యగా ఉన్నాయి. గుండ్రంగా అరచేతి మందాన ఉన్నాయి?” అన్నాడు.*

*“దేనితో చేస్తారో?” మెల్లిగా గొణిగినట్లు అడిగింది.*

*“వరిపిండి తో నట” కొంచెం కరుగ్గా చెప్పాడు రాజశేఖరం.*

*ఇంకా ఏమంటే భర్తకి ఎంత కోపం వస్తుందోనని విశాలాక్షి లోపలికెళ్ళిపోయింది. ఎంత ఆలోచించినా భర్తకంత నచ్చిన ఆ ‘హైసర బజ్జ’ ఏమిటో ఆమెకు అర్ధం కాలేదు.*

*చివరకి కుడుములై ఉంటాయనుకొని, బియ్యప్పిండి, బెల్లం కలిపి, అరచేతి మందాన ఆవిరిలో ఉడికించి గుండ్రని కుడుములు చేసింది. చిన్నపళ్ళెంలో తెచ్చి భర్త ముందు పెట్టింది.*

*ఎంత నచ్చినా, మేనత్త ఇంట్లో తనివి తీరా బూరెలు తినడానికి మొహమాట పడ్డ రాజశేఖరం, ఇప్పడు భార్య వండి పెడితే తెగ లాగించెయ్యాలని ఆశగా ఎదురుచూస్తున్నాడు. భార్య తెచ్చిన కుడుములు చూసేసరికి అతనికి కోపం నషాళానికంటింది. [కోరిక లేదా కామం తీరక పోతే క్రోధం పర్యవసానమని భగవద్గీత చెబుతుంది]*

*భార్య అలుసుగా కనబడి ఒక్క పెట్టున ఆ పిల్ల చెంప ఛెళ్ళుమనిపించాడు. విశాలాక్షి ఘోల్లుమంది.*

*ఈ గొడవకి ప్రక్కింటి పిన్నిగారు పరుగెత్తుకొచ్చింది. అప్పటికే విశాలాక్షి చెంప వాచి పోయింది.*

*అది చూసి ప్రక్కింటి పిన్నిగారు “అయ్యో! అదేమిటి నాయనా, అమ్మాయిని అలా కొట్టావు? పిల్లబుగ్గ బూరెలా పొంగి పోయింది చూడు” అంది మందలింపుగా.*

*”ఆ అదే పిన్నిగారు, అదే! బూరె బూరె!” అన్ని మరిచి పోయి ఆనందంగా గావుకేక పెట్టాడు రాజశేఖరం.*

*నొప్పి, అవమానం మరిచిపోయి ఫక్కున నవ్వింది విశాలాక్షి.*

*విషయం తెలిసాక విరగబడి నవ్వారు ప్రక్కింటి పిన్నిగారు.*

*రాజశేఖరం భార్యకి క్షమాపణ చెప్పుకొన్నాడు.*

*బియ్యం నానపోసి దంచి విశాలాక్షి తియ్యటి బూరెలు చేసి పెట్టింది.*

*ప్రక్కింటి పిన్నిగారితో సహా అందరూ ఆనందంగా ఆరగించారు.*