పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు పదవికి గండం…!!!

పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం తప్పేలా లేదా..? అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కంటే ముందే ఆయన రాజీనామా చేయాల్సి పరిస్థితులు తలెత్తాయా ? కుర్చీ దిగండంటూ పాక్ ఆర్మీ చీఫ్ హెచ్చరికలకు ఇమ్రాన్ లొంగనున్నారా..? పాకిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇవే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం ఇస్లామిక్ సహకార సంస్థ ఓఐసీ సమావేశం జరగనుంది. అది ముగిసిన వెంటనే ఇమ్రాన్ తన పదవికి రాజీనామా చేయాలంటూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా తేల్చిచెప్పినట్లు సమాచారం.ఈ మేరకు పాక్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా, ఐఎస్‌ఐ చీఫ్ నదీమ్ అంజుమ్‌ ఇటీవలే ఇమ్రాన్‌ ఖాన్‌తో సమావేశమయ్యారు. ఇమ్రాన్‌ను పదవి నుంచి తొలగించాలని ఈ సమావేశం అనంతరం మరో ముగ్గురు సీనియర్ లెఫ్టినెంట్ జనరల్స్‌తో కలిసి ఆర్మీ చీఫ్ నిర్ణయించినట్లు పాక్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. గత కొంత కాలంగా పాక్ ప్రధానికీ, అక్కడి ఆర్మీ చీఫ్‌కు మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
గతంలో ఇమ్రాన్ అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన పాక్‌ ఆర్మీ.. ఇప్పుడు ఆయన పట్లు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 25న ఇమ్రాన్‌పై అవిశ్వాస తీర్మానం జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అయితే తమ పార్టీ నుంచి వెళ్లిపోయిన వారు తనకు వ్యతిరేకంగా ఓటు వేయకుండా ఆదేశాలివ్వాలంటూ ఇమ్రాన్ పాక్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వారు ఓటు వినియోగించుకునే విషయంలో స్పష్టత ఇవ్వాలని పిటిషన్ వేశారు.ఇమ్రాన్ ఖాన్ పదవికి గండం వాటిల్లుతుందని ప్రచారంతో ప్రజల మద్దతు కోసం ఇమ్రాన్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖైబర్ పఖ్తూన్ ఖ్వా ప్రావిన్సులో జరిగిన ఓ ర్యాలీలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. భారత్ మరియు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.