కేంద్రంలో బిజేపి, రాష్ట్ర టిఆర్ఎస్ ప్రభుత్వాల పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు: రాహుల్‌ గాంధీ.

రైతులు, యువకులు, విద్యార్థులు, చిన్న తరహా పరిశ్రమల యజమానుల సమస్యలు తెలుసుకుంటూ జోడో యాత్రలో ముందుకెళ్తున్నామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలిపారు. రాష్ట్రంలో భాజపా, తెరాస పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. దేశంలో ఇంత తీవ్రమైన నిరుద్యోగ సమస్య ఎప్పుడూ లేదన్నారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా మెదక్‌ జిల్లా పెద్దాపూర్ కూడలిలో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. 2014 తర్వాత కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేశారని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను మోదీ ప్రైవేట్‌కు అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని రాహుల్‌ మండిపడ్డారు. తెలంగాణలో రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు. సీఎం కేసీఆర్‌ భూములు లాక్కుంటూ రైతుల గొంతు నొక్కుతున్నారని విమర్శంచారు. కేంద్రం తేవాలనుకున్న రైతు వ్యతిరేక చట్టాలకు తెరాస మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. ‘‘రైతులు, కూలీలు, యువకులు తమ సమస్యలు చెప్తున్నారు. కలిసిన ప్రతి యువకుడు నిరుద్యోగం గురించి చెప్తున్నాడు. దేశంలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతుందో కేంద్ర పెద్దలు ఆలోచించాలి. ఉద్యోగ కల్పనా సంస్థలపై మోదీ, కేసీఆర్‌ దాడి చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు అమ్మేశారు. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,100, పెట్రోల్‌ ధర రూ.100 దాటినా మోదీ మౌనంగా ఉన్నారు. విద్వేషం, హింస, నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఈ జోడో యాత్ర చేస్తున్నా. ప్రజల ప్రేమ, ఆప్యాయత వల్ల పాదయాత్రలో అలసట రావడం లేదు’’ అని రాహుల్‌ పేర్కొన్నారు.