రైతు బీమా దరఖాస్తుకు నేడు ఆఖరు…!

రైతు బీమా దరఖాస్తుకు నేడు ఆఖరు…

రైతుల కుటుంబానికి ఆర్థ్దిక భరోసా ఇవ్వాలనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలుచేస్తున్నది. అయితే బీమా నమోదు కోసం శనివారం చివరి గడువు(last day).

కొత్తగా పాస్‌ పుస్తకాలు పొందిన రైతులు లేదంటే గతంలో బీమాకు దరఖాస్తు చేసుకోని రైతులకు మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం గత నెల 11 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు ఇవ్వగా ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాలో 15,258 మంది బీమాకు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ రోజు వరకు నమోదు చేసుకున్న రైతులకే రూ.5లక్షల బీమా

ఈ ఏడాది జూన్‌18లోపు పాస్‌బుక్స్‌ తీసుకున్న రైతులందరూ అర్హులే…

ఇటీవల నిర్వహించిన 25 రోజుల స్పెషల్‌ డ్రైవ్‌లో 15వేల దరఖాస్తులు…

నల్లగొండ జిల్లాలో ఇప్పటికే 2.71 లక్షల మందికి బీమా..

రైతుల కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వాలనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలుచేస్తున్నది. అయితే బీమా నమోదు కోసం శనివారం చివరి గడువు. కొత్తగా పాస్‌ పుస్తకాలు పొందిన రైతులు లేదంటే గతంలో బీమాకు దరఖాస్తు చేసుకోని రైతులకు మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం గత నెల 11 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు ఇవ్వగా ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాలో 15,258 మంది బీమాకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మిగిలిన రైతులు నేడు సాయంత్రం ఐదు గంటల లోపు సంబంధిత ఏఈఓల దగ్గర దరఖాస్తు చేసుకుంటే ఈ నెల 13వ తేదీన ప్రభుత్వం మరో ఏడాది అమలు చేసేందుకు రెన్యువల్‌ చేసే బీమా పథకంలో అర్హులుగా ఉంటారు. జిల్లాలో 2017-18 నుంచి ఈ రైతు బీమా పథకం అమలవుతుండగా ఇప్పటి వరకు 2.71లక్షల మంది రైతులు ఈ పథకంలో అర్హులుగా ఉండగా తాజాగా దరఖాస్తు చేసుకున్న వారిలో మరో 15 వేల మంది చేరనున్నారు. అయితే ఈ ఏడాది జూన్‌-18వ తేదీ లోపు పాస్‌ పుస్తకాలు తీసుకున్న రైతులు మాత్రమే ఈ రైతు బీమా పథకానికి అర్హులు కానుండగా వీరు మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే వీరికి రైతు బంధు వస్తుంది కనుక ప్రభుత్వం వీరికి మాత్రమే అవకాశం ఇచ్చింది.

నేటి సాయంత్రంతో గడువు పూర్తి…

రైతు బీమా పొందాలను కునే వారు నేటి సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకుంటేనే ఈ పథకం వర్తించనుంది. ఈ ఏడాది జూన్‌-18లోపు పాస్‌ పుస్తకాలు పొందిన రైతులు దరఖాస్తు ఫారంతో పాటు పాస్‌ బుక్‌, ఆధార్‌ కార్డు, నామినీ ఆధార్‌ కార్డుతో సంబంధిత ఏఈఓకు ఇస్తే వారు వెంటనే రైతు బీమా పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. బీమా పొందే రైతు మాత్రం తప్పని సరిగా ఏఈఓ దగ్గరకు వెళ్లాల్సిందే. ఈ రోజు వరకు వచ్చిన దరఖాస్తులన్నింటిని ఈ రోజు రాత్రి 12గంటల వరకు ఏఈఓలు ట్యాబ్‌లో ఎంట్రీ చేయాల్సి ఉంది. ఈ బీమా పొందిన వారి పేరిటి ప్రభుత్వమే ఉచితంగా ఎల్‌ఐసీ భీమా సంస్థ్దకు ప్రీమియం చెల్లిస్తున్న నేపథ్యంలో రైతు ఏ కారణం చేతనైనా అంటే ప్రమాదంతో పాటు సహజ మరణం పొందినప్పటికీ నామినీ పేరుతో ఉన్న వ్యక్తులకు వారం పది రోజుల్లోనే ఎల్‌ఐసీ నుంచి క్లెయిమ్‌ అందనుంది.

ఇప్పటి వరకు 15 వేల దరఖాస్తులు రాక..

రైతు బంధు, బీమాను దృష్టిలో పెట్టుకోని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా పాస్‌ పుస్తకాలు పొందిన వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ఏడాది జూన్‌-18లోపు పాస్‌ పుస్తకాలు తీసుకున్న వారికి ఈ అవకాశం కల్పించగా అప్పటి వరకు జిల్లాలో పోడు భూముల పట్టాలు తీసుకున్న వారితో పాటు మొత్తగా 27,510 మంది ఉన్నారు. అందులో ఇప్పటి వరకు 15,258 మంది రైతు బీమాకు దరఖాస్తు చేసుకోగా మిగిలిన వారు చేసుకోలేదు.

దరఖాస్తు చేసుకోవాలి

రైతు ఏ కారణం చేతనైనా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థ్దిక కారణాలతో రోడ్డున పడొద్దనే ఆలోచనతో ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తుంది. గుంట జాగ ఉన్న రైతులు కూడా ఈ పథకం కింద అర్హులే. ప్రభుత్వమే ఉచితంగా ప్రీమియం చెల్లిస్తుంది. మరణించిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల బీమా అందుతున్నందున ప్రధానంగా నిరుపేద సన్న, చిన్న కారు రైతులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి.