దొందూదొందే – సామెత కథ..

అనగనగా ఒక ఊరు(village).
ఆ ఊళ్ళో ఒక నత్తి వాడుండేవాడు.
అతన్ని అందరూ ఎగతాళి చేసేవారు.
నత్తి కారణంగా అతనికి పెళ్ళి కాకుండా వుంది.
చివరికి అతని తల్లితండ్రులు చాలా దూరంలో వున్న
ఒక ఊరిలో అమ్మాయిని చూసి ఆ అమ్మాయితో తమ అబ్బాయికి పెళ్ళి చేశారు. పెళ్ళి జరుగుతున్నంతసేపూ ఇద్దరూ మాట్లాడకుండా కూచున్నారు. సిగ్గుపడుతున్నారని అందరూ అనుకున్నారు.

పెళ్ళి తంతు అంతా పూర్తి అయిన తర్వాత అబ్బాయినీ,
అమ్మాయినీ పల్లకీలో ఎక్కించి అబ్బాయి ఊరికి పంపించారు.
దారిలో వారికి పూచిన చింతచెట్ల వరస కనిపించింది.
👉నత్తివాడు సంతోషం పట్టలేక “ తింతలు తూతాయి”
(చింతలు పూశాయి )అన్నాడట.
👉అది విని అమ్మాయి “ తూతే తెట్టు తుయ్యదా తాతే తెట్టు తాయదా “
(పూసే చెట్టు పుయ్యదా , కాసే చెట్టు కాయదా ) అన్నదట.
👉వారి వెనక వస్తున్నపురోహితుడు “ దొందూ దొందే “
(రెండూ రెండే) అని అన్నాడట.
ఆ ముగ్గురు నత్తివాళ్ళను చూసి పల్లకీ బోయీలు నవ్వుకున్నారట…..
అలాఅలా దొందూ దొందే అనే సామెత వాడుక లోనికి వచ్చింది……..