తెలంగాణలో ఎన్నికలకు రంగం సిద్దం..అక్టోబర్ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం..!

తెలంగాణలో ఎన్నికలకు రంగం సిద్దం..

అక్టోబర్ 3 నుండి 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్న ఎన్నికల సంఘం..

అక్టోబర్ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం..

తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ నెలలోపు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం వచ్చే నెలలో రాష్ట్రంలో పర్యటించనుంది. అక్టోబర్ 3వ తేదీ నుండి మూడ్రోజుల పాటు హైదరాబాద్‌లో ఈసీ బృందం సమీక్షిస్తుంది. మొదటి రోజు జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన పార్టీలతో సమావేశం కానుంది. ఎక్సైజ్, ఆదాయపన్ను, జీఎస్టీ, రవాణా, నిఘా విభాగాల అధికారులు, బ్యాంకర్లతో సమావేశం కానుంది. డబ్బు, మద్యం, కానుకల ప్రవాహ కట్టడిపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తుంది.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు, రాష్ట్ర పోలీస్ బలగాల నోడల్ అధికారులతో సమావేశమై భద్రతాపరమైన ప్రణాళిక, ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. ఆ తర్వాత రోజు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమావేశం కానున్నారు. చివరి రోజు రాష్ట్ర సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు.