తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. ప్రధాని మోదీని కథ తేలుస్తా..
గద్దె దించేవరకు నిద్రపోనని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని రేవంత్ ఆరోపించారు. జార్ఖండ్‌లో సీఎం హేమంత్ సోరేన్‌ను కలిసిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి ఫ్రంట్ పెట్టడంలేదని కేసీఆర్ చెప్పారని విమర్శించారు. కేసీఆర్‌కు రోజులు దగ్గర పడ్డాయని.. రాష్ట్రంలో పేదల కష్టాలు తీర్చాల్సిన ఆయన దేశం అంతటా దేశ దిమ్మరిలా తిరుగుతున్నాడని.. చెట్టుమీద కోతిలాగా, కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నారని రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని మరోసారి రేవంత్‌రెడ్డి నొక్కి చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌లో సీఎం కేసీఆర్​అసెంబ్లీని రద్దు చేస్తారని… మార్చిలో ఎన్నికలు వస్తాయని రేవంత్ పేర్కొన్నారు. 12 నెలలు కష్టపడితే అధికారం కాంగ్రెస్​పార్టీదే అని రేవంత్​ రెడ్డి అన్నారు. కాంగ్రెస్​ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్​మెంట్, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు ప్రస్తుతం టెంటు లేదు, ఫ్రంట్ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలిరోజే ప్రగతి భవన్‌ను అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌గా మారుస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.