*తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.* ఈ ఆరు నెలలు కష్టపడి పనిచేయాలని… పనితనం ఆధారంగానే టికెట్లు వస్తాయని నేతలకు సూచించారు. అలాగే సర్వేల ప్రాతిపదికనే టికెట్లు కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ ప్రాంగణంలోని ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చించారు.
*పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుంది :* పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసిన వారిని తప్పుకుండా గుర్తిస్తుందని రేవంత్రెడ్డి అన్నారు. ఇందుకు కర్ణాటకలో మంత్రి పదవి దక్కించుకున్న బోసురాజే ఉదాహరణ అని చెప్పారు. ఈ సమావేశంలో నాలుగు తీర్మానాలు చేసినట్లు రేవంత్ తెలిపారు. ఏఐసీసీ సెక్రెటరీలు బోసురాజు, నదీమ్ జావీద్లను అభినందిస్తూ, కొత్తగా నియమితులైన సెక్రెటరీలకు స్వాగతం పలుకుతూ 2 వేర్వేరు తీర్మానాలు చేసినట్లు పేర్కొన్నారు. బోయిన్పల్లిలో రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ శంఖుస్థాపనకు సోనియాగాంధీని ఆహ్వానించాలని సభ మరో తీర్మానం చేసిందని చెప్పారు.