ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూస్తారు…కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు తగిన బుద్ధి చెప్తాం.. తెలంగాణా రాష్ట్ర మంత్రలు స్ట్రాంగ్ వార్నింగ్….
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నూకలు తినాలన్న వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు అంతా కండ కవరమా! అని వేముల అన్నారు. వెంటనే తన మాటలను ఆయన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఈ విషయంలో కేంద్రాన్ని ఒక్క మాట అడగటం లేదన్నారు. ఈ విషయంలో అటు బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒక్కటయ్యాయని విమర్శించారు…
మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ...
వడ్లు కొనాల్సిన బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నూకలు తినాలన్న వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం ఎగుమతులను పెంచుకునే ప్రయత్నాలను కేంద్రం చేయడం లేదని ఆక్షేపించారు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. ఉగాది తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, కేసీఆరే రైతులకు రక్షణ కవచం అని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు..
మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ...
తెలంగాణలో పండించిన రెండో పంట కొనాలని ఐదుసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రిని కలిసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వెళ్లిన ప్రతిసారీ తమను అవమానిస్తూ, అవహేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రజలను అవమానించి వాళ్లంతా అంతకంత అనుభవిస్తారని గంగుల కమలాకర్ శాపం పెట్టారు.
తెలంగాణ ప్రభుత్వం బాయిల్డ్ రైస్ ఇవ్వమని రాసి ఇచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనటంపై గంగుల ఆగ్రహం వ్యక్తం చేశారు. బాయిల్డ్ రైస్ ఇవ్వమని రాసిస్తేనే ధాన్యం కొంటామని తమ మెడపై కత్తి పెట్టి సంతకం చేయించకున్నారని గుర్తు చేశారు. అప్పటికే ప్రభుత్వం రైతులకు, మిల్లర్లకు డబ్బులు ఇవ్వటం కారణంగా కేంద్రం ఇష్టమొచ్చినట్లు రాసిన అగ్రిమెంట్ పై సంతకం చేయాల్సి వచ్చిందన్నారు. అసలు తెలంగాణ బిడ్డ అయిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇక్కడి ప్రాంతాల ప్రయోజనాల కోసం ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు.
ఇప్పటికీ గతేడాది రైస్ తెలంగాణ పంపించటం లేదని కిషన్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారన్నారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ మూడు నెలల్లో సాధ్యమా అని గంగుల ప్రశ్నించారు. సాధారణంగా ఏటా ఏడాది ఎక్స్ టెన్షన్ చేస్తుంటారని…మూడు నెలల్లో బియ్యం సేకరణ సాధ్యం కాదని తెలిసి కూడా కావాలనే కేంద్రం అలా చేసిందన్నారు. ఇప్పటికీ కూడా రా రైస్ కూడా కొనలేదన్నారు. అబద్దాలు మానుకోని తెలంగాణ రైతులకు మేలు చేసే విధంగా రెండో పంట ధాన్యాన్ని కూడా కొనాలని గంగుల డిమాండ్ చేశారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ…
ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూస్తారు.. ఉగాది వరకు ప్రశాంతంగా కేంద్రానికి నిరసనలు, వినతులు తెలుపుతాం. ఉగాది తర్వాత నూకెవరు ? పొట్టు ఎవరు తేలుస్తాం. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి ప్రజలకు నూకలు తినిపించి చూడాలి.. లేదా పీయూష్ గోయల్ తో క్షమాపణ చెప్పించాలి. ధాన్యం కొనుగోలు సమస్యను అర్ద్రతతో కూడిన హృదయంతో చూడాలి. రాజకీయ కోణంలో, రాజకీయ కక్ష్యతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాం అని భావిస్తే అది శునకానందమే అవుతుంది అన్నారు.