రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం మంత్రి సబిత..

రాష్ట్రంలో సోమవారం నుంచి పాఠశాలలను పునః ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు.
సెలవులు పొడిగింపు లేదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలను సోమవారం నుంచి పునః ప్రారంభించనున్నట్లు చెప్పారు. పాఠశాలల పునః ప్రారంభం నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలని పాఠశాలల నిర్వాహకులను ఆదేశించారు. మన ఊరు – మన బడిలో భాగంగా 9వేల పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా.. నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు…అలాగే సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాలని చేపట్టాలని నిర్ణయించారని, ఇందులో భాగంగా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ మేరకు 1.04లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. బడిబాటలో భాగంగా ఇప్పటికే గతవారంలో 70వేల మంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించామన్నారు. కార్యక్రమం మరో వారం రోజులు కొనసాగుతుందన్నారు. ఇంగ్లిష్ మీడియం బోధన నేపథ్యంలో పిల్లలకు ఇబ్బందులు లేకుండా.. నెల రోజుల పాటు బ్రిడ్జి కోర్సు మాదిరిగా తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు…ఒకేసారి ఇంగ్లీష్ మీడియం తరగతులతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని, ఈ మేరకు వారు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాఠ్య పుస్తకాలను ప్రింట్‌ చేయడం జరిగిందన్నారు. విద్యార్థులందరికీ తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలో బుక్స్‌ను అందిస్తామని, దాదాపు 1.64కోట్ల బుక్స్‌ను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఎప్పటిలాగే ఉచితంగా యూనిఫామ్స్‌ను అందిస్తామని, మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు తెలిపారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా పాఠశాలలు కొనసాగేలా అందరు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం నేపథ్యంలో తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై శ్రద్ధ వహించాలని కోరారు.

బండి సంజయ్‌పై మంత్రి ఫైర్‌
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మన ఊరు – మన బడి’కి కేంద్రం నిధులు ఇచ్చిందని బీజేపీ నేత చెబుతున్నారని, కార్యక్రమానికి రూ.2700కోట్లు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇచ్చిన పైసలు ఎక్కడ విడ్‌త్రా చేసుకోవాలో బండి సంజయ్‌ చెప్పాలన్నారు. ఒకపక్క టెట్‌ వాయిదా వేయాలంటూనే.. మరో 20వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలంటున్నారని, బండి సంజయ్‌ బాధ్యతగా మాట్లాడితే మంచిదన్నారు. ఉపాధ్యాయులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా జీతాలు పెంచామన్నారు. ఉపాధ్యాయులు మానసిక క్షోభకు గురవుతున్నారన్న దుష్ప్రచారం మానుకోవాలని సూచించారు. రాష్ట్రానికి నవోదయ స్కూల్స్‌, గిరిజన వర్సిటీని తెచ్చి బండి సంజయ్‌ మాట్లాడాలని సబిత హితవు పలికారు.