మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా..
దేశం మొత్తం కూడా మహారాష్ట్ర రాజకీయాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో నాటకీయ పరిణామాలు ఏమైనా జరుగుతాయో అని ఎదురుచూసిన రాజకీయ నాయకులు అందరికీ శుభం కార్డు పడింది…
మహారాష్ట్ర(Maharashtra) రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం బలపరీక్ష జరగాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన క్షణాల్లోనే తన రాజీనామా ప్రకటించారు. ఫేస్బుక్ లైవ్లో మాట్లాడిన ఉద్ధవ్ తన నిర్ణయాన్ని వెలువరించారు. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తున్నట్లు ఉద్దవ్ చెప్పారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వానికి కొందరి దిష్టి తగిలిందని..ఆ దిష్టి ఎవరిదో అందరికీ తెలుసని ఉద్దవ్ ఠాక్రే అన్నారు. తన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం బాలాసాహెబ్ ఆశయాలు నెరవేర్చిందన్నారు. ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ఉద్దవ్ ఠాక్రే స్పష్టం చేశారు..
రాజీనామాకు ముందు క్యాబినెట్ నిర్ణయాలు..!!
రాష్ట్రంలో రెండు నగరాల పేర్లను మర్చుతూ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఔరంగాబాద్ పేరును శంభాజీనగర్గా, ఉస్మానాబాద్ పేరు ధారా శివ్గా మార్చింది. నవీముంబై ఎయిర్పోర్టు పేరును డీబీ పాటిల్ ఎయిర్పోర్టుగా మారుస్తూ ఉద్ధవ్ ఠాక్రే కేబినేట్ ఆమోదం తెలిపింది. కాగా, కేబినెట్ మీటింగ్లో ఉద్వేగభరిత సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం ఉద్దవ్ ధన్యవాదాలు తెలిపారు. తన వల్ల ఏమైనా తప్పు జరిగితే మన్నించాలని కోరారు. తన వాళ్లే తనను మోసం చేశారని, ఈ పరిస్థితికి తీసుకొచ్చారని ఉద్వేగానికి లోనయ్యారు. భేటీ అనంతరం మీడియాకు మాట్లాడి ఉద్దవ్ వెళ్లిపోయారు.