ఉక్రెయిన్‌ కు అమెరికా, జర్మనీ దేశాల యుద్ధ ట్యాంక్‌లు…!

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే రష్యాను ఎదుర్కొనేందుకు తమకు యుద్ధ ట్యాంక్‌లు కావాలని కొన్నాళ్ల నుంచి ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఆ దేశానికి యుద్ధ ట్యాంక్‌లను పంపేందుకు అమెరికా, జర్మనీ దేశాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ రెండు అగ్రదేశాలు యుద్ధ ట్యాంక్‌లను పంపిస్తే.. అప్పుడు ఉక్రెయిన్ వార్ కొత్త రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దీనిపై త్వరలో ఓ ప్రణాళికను వెల్లడించనున్నారు. సుమారు 30 ఎం1 అబ్రామ్స్ ట్యాంకులను పంపాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కనీసం 14 లియోపార్డ్ 2 ట్యాంక్‌లను ఉక్రెయిన్‌కు పంపించాలని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కల్జ్ భావిస్తున్నారు.

ఈ నిర్ణయాన్ని రష్యా తీవ్రంగా పరిగణిస్తోంది. అమెరికాలో ఉన్న రష్యా అంబాసిడర్ దీన్ని తప్పుపట్టారు. ఇది మళ్లీ రెచ్చగొట్టడమే అవుతుందన్నారు. యుద్ధ ట్యాంక్‌లు వస్తే రష్యా ఆధీనంలోకి వెళ్లిన తమ ప్రదేశాలను మళ్లీ చేజిక్కించుకోవచ్చు అని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు..